SPECIAL EDITION DAILY
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 11:06 pm Posted by : SPECIAL EDITION DAILY

ఏపీకి రైల్వే గిఫ్ట్

ఏపీ బ్యూరో, మే 05; (స్పెషల్ ఎడిషన్): విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆనందాన్ని కలిగించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. 2026 జూన్ 1వ తేదీ నుంచి విశాఖను కేంద్రంగా చేసుకుని ఈ కొత్త జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక రైల్వే సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగానికి కీలక మలుపుగా భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన విశాఖ డివిజన్ మరియు రాయగడ డివిజన్‌ల మధ్య సమన్వయం పెరగడం ద్వారా రైల్వే సేవలు మరింత సమర్థవంతంగా మారనున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పెట్టుబడులు, పరిశ్రమలు పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడనుంది. రాష్ట్ర విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.