SPECIAL EDITION DAILY
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:57 am Posted by : SPECIAL EDITION DAILY

జన్మనిచ్చి.. జనారణ్యంలో విడిచి!

-శంషాబాద్ రాళ్లగూడలో రోడ్డుపై నవజాత శిశువు కలకలం

-పసికందు ఏడుపు విని రక్షించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం

-ఆసుపత్రికి తరలించి చికిత్స.. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం

-సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పాపను వదిలేసిన వారి కోసం ముమ్మర గాలింపు

శంషాబాద్, జూలై 22 (స్పెషల్ ఎడిషన్): కన్న పేగు బంధాన్నే మరచిపోయేలా చేసిన హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో బుధవారం వెలుగుచూసింది. జన్మనిచ్చిన కొద్ది గంటలకే ఓ నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లిపోవడం స్థానికులను తీవ్ర కలచివేసింది. మానవత్వాన్ని ప్రశ్నించే ఈ ఘటన రాళ్లగూడ ఇంద్రానగర్ రాజీవ్ గృహాల సమీపంలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో నిత్యకృత్యాల కోసం వెళ్తున్న స్థానికులకు ఒక్కసారిగా పసికందు ఏడుపు వినిపించింది. మొదట ఏం జరిగిందో అర్థంకాక చుట్టుపక్కల వెతికిన వారు, రోడ్డుపక్కనే వస్త్రంలో చుట్టిన నవజాత శిశువు ఒంటరిగా ఉండడాన్ని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే శిశువును ఎత్తుకుని సంరక్షిస్తూ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శిశువుకు అవసరమైన చికిత్స అందించగా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. శిశువు సురక్షితంగా ఉండడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పాపను అక్కడికి తీసుకొచ్చి వదిలేసిన వారు ఎవరనే విషయాన్ని గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే ఇటీవల ప్రసవించిన మహిళలు, అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. శిశువును ఎందుకు రోడ్డుపై వదిలివెళ్లాల్సి వచ్చిందనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమాయకమైన నవజాత శిశువును ఇలా నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేయడం దారుణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టిన బిడ్డను కాపాడాల్సిన వారు ప్రాణాలకు ప్రమాదం కలిగేలా వదిలేయడం అత్యంత అమానుషమని పేర్కొన్నారు. నిందితులను త్వరగా గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఘటన మరోసారి సమాజంలో మానవ విలువలు, కుటుంబ బాధ్యతలు, శిశు సంరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. నవజాత శిశువులను పరిత్యజించడం వంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరింత చైతన్యం కల్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.