SPECIAL EDITION DAILY
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 11:25 am Posted by : SPECIAL EDITION DAILY

బొంగులూరు ఓఆర్‌ఆర్‌ వద్ద కాల్పుల కలకలం..?

చోరీల కేసుల్లో నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్‌

గాయపడిన నిందితుడు ఆసుపత్రిలో చికిత్స.. పూర్తి వివరాలు నేడు వెల్లడి చేసే అవకాశం

రంగారెడ్డి జిల్లా బ్యూరో, జూలై 1 (స్పెషల్‌ ఎడిషన్):

నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడిన నిందితుడిని పట్టుకునే క్రమంలో హైదరాబాద్‌ శివారులోని అవుటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) వద్ద పోలీసులు కాల్పులు జరిపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు గాయపడగా, అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు బుధవారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో నమోదైన వరుస చోరీల కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి హైదరాబాద్‌లో సంచరిస్తున్నట్లు నల్గొండ సీసీఎస్‌ (క్రైమ్‌ క్లూస్‌ విభాగం) పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుని నిందితుడి కదలికలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఆదిభట్ల సమీపంలోని అవుటర్‌ రింగ్‌ రోడ్‌ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసిన నిందితుడు ప్రతిఘటిస్తూ అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించినట్లు సమాచారం. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు హెచ్చరికల అనంతరం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో నిందితుడు కాలికి గాయపడినట్లు సమాచారం. గాయపడిన నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాంత్గా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణలో అతడిపై నల్గొండతో పాటు వివిధ ప్రాంతాల్లో పదికి పైగా చోరీ కేసులు నమోదైనట్లు సమాచారం. అంతేకాకుండా నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఓ కానిస్టేబుల్‌ హత్య కేసులో కూడా అతడు నిందితుడిగా ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతరం పోలీసులు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఆధారాలను సేకరించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులు, నిందితుడి నేరచరిత్ర, ఇతర కేసులకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా బుధవారం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.